Friday, February 5, 2016

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. క్లైమాక్స్‌లో శుభంకార్డు పడుతుందా! ఊహించని ఫలితం.. ఎదురైతే.. ఎలా! పైకి.. గంభీరంగా కనిపిస్తున్నా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల అంతర్మథనం ఇదే. అధికార.. ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగిన వారసులకు.. ఈ గెలుపు..తప్పనిసరిగా మారింది. భవిష్యత్తు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కీలకమైంది.



అమాత్యుల మెడపై కత్తి 
మారిన రాజకీయ సమీకరణలతో కొత్తపొత్తులు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీ పీఠంపై గురిపెడితే.. ప్రతిపక్షాలు.. సమ ఉజ్జీలుగా నిలిచేందుకు అహర్నిశలు శ్రమించాయి. సర్వేలతో గెలుపుగుర్రాలకు టిక్కెట్‌ కేటాయించామంటూ బహిరంగంగా ప్రకటించాయి. వందసీట్లు రాకపోతే.. రాజకీయ సన్యాసమేనంటూ నేతలు సవాల్‌ విసరటంతో గ్రేటర్‌లో రాజకీయం వేడెక్కింది. సెటిలర్ల ఓట్లను రాబట్టేందుకు ఏపీ, తెలంగాణ మంత్రులంతా.. నగరంలోనే తిష్టవేశారు. డివిజన్లలో ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమాత్యులు.. పర్యటించిన బస్తీలు.. కాలనీల్లో ఎంతవరకూ ప్రభావితం చేయగలిగారనేది.. అక్కడి అభ్యర్థుల విజయంతో బయటపడనుంది. ముఖ్యంగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మెడపై కత్తిలా మారిందనేది బహిరంగ రహస్యం. సానుకూలమంటూ.. నివేదికలిచ్చిన.. డివిజన్లలో ఫలితం.. తారుమారైతే.. అనే ఆలోచనే నేతలగుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది.

ఏడేళ్లుగా ఎదురుచూపులు 
2009 ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. మరికొందరు కొద్దిపాటి ఓట్లతో ఓటమి చవిచూశారు. వారంతా.. మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏడేళ్లపాటు ఎదురుచూశారు. కొందరి ఆశ.. డివిజన్ల మార్పుతో గల్లంతైంది. మరికొందరు.. బంధుగణాన్ని రంగంలోకి దింపి
ముచ్చట తీర్చుకున్నారు. యాభైశాతం మహిళా రిజర్వేషన్ల పుణ్యమాంటూ.. సతులు.. పుత్రికలు.. అమ్మలు.. బామ్మలు పదిరోజుల పాటు గల్లీగల్లీ చుట్టారు. కీలకమైన డివిజన్లలో కోట్లు కుమ్మరించారు. నగరంలోని ఓ ప్రధాన డివిజన్‌లో.. ఒక్కరోజు ఏకంగా 70లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఇక్కడ పోటీ.. నువ్వా-నేనా అన్నట్లుగా ఉండటంతో... అనుచరులతో బూతల వారీగా లెక్కలు తెప్పించుకుని.. పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

బెట్టింగ్‌కూ.. భయమే 
క్రికెట్‌.. కబడ్డీ.. ఎలక్షన్‌ సమయంలో.. ఫలితాలపై బెట్టింగ్‌లు కామన్‌. కానీ.. గ్రేటర్‌ బరిలో.. గ్యారంటీ గెలుపంటూ.. చెబుతున్న పార్టీలు సైతం పందెం.. మాట వినగానే వెనుకంజ వేస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓ డివిజన్‌ అధికార పార్టీకు కీలకంగా మారింది. అక్కడ.. హోరాహోరీ పోటీ జరిగింది. ఇరువైపులా అనుచరులు లక్షల్లో పందేలకు దిగి.. చివరి నిమిషంలో విరమించుకున్నట్లు సమాచారం. ఉప్పల్‌ నియోజకవర్గంలో.. ఓ ప్రజాప్రతినిధి తమదే విజయమంటూ.. ధీమా వ్యక్తంచేశాడు. దీంతో ప్రత్యర్థులు.. బెట్‌ అనగానే.. వద్దులే గురూ! మాటమార్చారని తెలిసింది. 

No comments:

Post a Comment