Friday, January 22, 2016

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి మిస్టరీ వీడింది...

లండన్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు యూకేకు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ మృతి మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిపై ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఆ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. 1945 ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి తైవాన్‌ రాజధాని తైపీ శివార్లలో ఓ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నేతాజీతో పాటు, అతని సన్నిహితుడు కల్నల్‌ హబిబర్‌ రెహ్మాన్‌ఖాన్‌ కూడా ఉన్నారు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నేతాజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఓ జపాన్‌ డాక్టర్‌ నేతాజీకి చికిత్స అందించారు. అనంతరం నేతాజీ కోమాలోకి వెళ్లిపోయారు. కాగా, కొద్ది సేపటికే ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడే పనిచేసిన నర్సు కూడా ధృవీకరించింది. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేతాజీ ఓ ఇంగ్లీషు అనువాదకుడిని కోరినట్లు వారు చెబుతున్నారు.



ఆ సమయంలో.. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలొదిలానని, తన మరణవార్త భారత్‌కు తెలియజేయాలని నేతాజీ కోరుకున్నారు. ఈ విషయాన్ని నేతాజీ సన్నిహితుడు రెహ్మాన్‌ఖాన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఎప్పటికీ సేవలందించాలని ఆయన కాంక్షించినట్లు రెహ్మాన్‌ ఖాన్‌ తెలిపారు. కాగా, నేతాజీ మరణం తర్వాత జపాన్ అధికారులు, ఇతర సిబ్బంది ఆయన మృతదేహం వద్ద వరుసగా నిల్చుని సెల్యూట్ చేసి నివాళులర్పించారు. ఈ వివరాల ఆధారంగా నేతాజీ ఆ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు స్పష్టమవుతోందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.

No comments:

Post a Comment