Wednesday, January 20, 2016

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ-సీ31

శ్రీహరికోట(సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ-సీ31 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)నుంచి బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు రెండో లాంచ్‌పాడ్ నుంచి ప్రారంభమైన ఈ ప్రయోగంలో భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ  విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1,425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతంతో షార్‌ శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీహరికోట శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.



అయితే ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చారు. నావిగేషన్ (దిక్సూచి) పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఈరోజు పీఎస్‌ఎల్‌వీ సీ-31 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్లి రోదసీలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ ప్రయోగం 33వది కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఐదో ఉపగ్రహం కావడం గమనార్హం. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో రెండు ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

ప్రయోగం ఇలా జరిగింది
ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో విజయవంతంగా పూర్తి చేశారు. కోర్‌అలోన్ దశలో 138.2 టన్నులు, ఎక్స్‌ఎల్ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 73.2 టన్నుల ఘన ఇంధనం ద్వారా 110.9 సెకన్లలో మొదటి దశను, 42 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 265 సెకన్లలో రెండో దశను, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 600.6 సెకన్లలో మూడో దశను, 2.5 టన్నుల ద్రవ ఇంధన సాయంతో 1,123.3 టన్నుల ద్రవ ఇంధనంతో నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేశారు. అనంతరం 1,161 సెకన్లకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని 20,657 కిలోమీటర్లలో అపోజి(భూమికి దూరంగా) 284 పెరిజీ(భూమికి దగ్గరగా) 19 డిగ్రీల భూబదిలీ కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించడం ద్వారా దశలవారీగా 284 కిలోమీటర్ల పెరిజీని పెంచుకుంటూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి భూస్థిరకక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు.
 
ఉపగ్రహంతో ఉపయోగాలివీ..
నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.
► రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి.
► ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

No comments:

Post a Comment