Wednesday, January 20, 2016

అమరావతి గ్రామాల్లో రసాభాసగా సాగుతున్న అవగాహన సదస్సులు

ఆంధ్రా రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు.. డిసెంబర్ నెలాఖరు నాటికే రాజధాని ప్రాంతంలో సేకరించిన రైతులు వారి ప్లాట్లను అప్పగిస్తామని గతంలో ఏపీ సర్కారు పెద్దలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా ఆ పని ఇంకా పూర్తి కానే లేదు. కేపిటల్ మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యిందని చెబుతున్నా ఇంకా కార్యాచరణ మాత్రం ఆరంభం కాలేదు. 



ముందు ఏదో ఒక మూవ్ మెంట్ కనిపించాలి కాబట్టి అన్న ఉద్దేశ్యంతో సెక్రటేరియటన్ నిర్మాణానికి ఏపీ సర్కారు పూనుకొంది. దీనికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. ఈ లోపుగా రాజధాని మాస్టర్ ప్లాన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామంటూ సీఆర్ డీఏ అధికారులు రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 

ఈ అవగాహన సదస్సులు రసాభాసగా సాగుతున్నాయి. గతంలో మంత్రులు రాజధాని పల్లెల్లో తిరిగినప్పుడు ఎన్నో హామీలు గుప్పించారు. గ్రామ కంఠాలను కదపబోమన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా గ్రామాల్లో హామీల వర్షం కురిపించారు. కానీ మాస్టర్ ప్లాన్ లో అవేమీ లేకపోవడంతో రైతుల ఆగ్రహం చెందుతున్నారు. 


మాస్టర్ ప్లాన్ లో రహదారులన్నీ సరళరేఖల్లా రూపొందించారు. దాన్ని యథాతథంగా అమలు చేస్తే గ్రామాల్లోని ఎన్నో కట్టడాలు కూల్చాల్సి ఉంటుంది. గ్రామాల జోలికి రామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఇలా ఎలా చేస్తారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.

ఈ అవగాహన సదస్సుల్లో రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు పోలీసుల అండతో ఈ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మంగళవారం జరిగిన ఓ సదస్సులో.. పోలీసులు, రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ కలగజేసుకొని రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 

గ్రామం మధ్యలోంచి రహదారి నిర్మాణానికి ఎట్టిపరిస్థితిలోనూ ఒప్పుకోబోమని రైతులు ఖచ్చితంగా చెప్పారు. గ్రామ కంఠాలపై స్పష్టత వచ్చిన తర్వాత మరో సారి రైతులకు అవగాహన కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన కమిషనర్ అక్కడ నుంచి బయటపడ్డారు. 

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. నాగార్జున సాగర్ కెనాల్స్ పొలాల్నీ తోటల్నీ చీలిస్తే ఎట్లా ఒప్పుకున్నారు అప్పటి రైతులు?ఏ నీటి పారుదల ప్రాజెక్టు అయినా రైతులు పొలాల్నీ భూముల్నీ పరిహారం తీసుకుని ఇస్తే వాటి మధ్యలో నుంచి వెళ్ళకుండా చుట్టూ తిరిగి వెళ్తున్నాయా?పరిహారమూ కావాలి,భూములూ చెక్కు చెదరకూడదు అంటే ఎట్లా!పాత వాట్ని చెక్కు చెదరకుండా ఉంచి అక్కడే కొత్తవాట్ని కట్టాలంటే మానవమాత్రులకి సాధ్యపడదు - పునాదులు కూడా గాలిలోనే వేస్తే తప్ప:-)

    ReplyDelete