Tuesday, April 5, 2016

నేడు బాబు జగ్జీవన్‌రాం జయంతి

జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు.భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు.
బయొగ్రఫి పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు. విద్యావేత్తగా, మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా, కరవు కోరల్లో చిక్కిన భారతావనిని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసి భారత ఆహార గిడ్డంగుల నేర్పరిచిన భారత దార్శనీకునిగా, బ్రిటిష్‌ కాలం నాటి రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు వేసిన రైల్వేమంత్రిగా, కయ్యానికి కాలుదువ్విన శత్రువును మట్టికరిపించి భారతదేశానికి విజయాన్ని అందించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్‌ భారత్‌ ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికారచనలో ఆయనకు సాటిరారన్న నాటి నాయకుల మాటలు అక్షర సత్యాలు. చివరికంటూ ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ బీహార్‌ రాష్ట్రంలో షాబాద్‌ జిల్లాలోని చాందా గ్రామంలో శిబిరాం, బసంతీదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్‌ 05న జన్మించారు. వీరిది దళిత కుటుంబం కావడంతో నాటి కుల సమాజపు అవమానాల్ని చవిచూశారు. నాటి అంటరాని తనమే జగ్జీవన్‌ రామ్‌ను సమతావాదిగా మార్చింది. నిరంతరం చైతన్యపూరిత ప్రసంగాలను వినడం, గాంధీజీ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ స్వరాజ్య ఉద్యమాలన్ని నిశితంగా గమనించారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ (మార్గానికి) అహింసా వాదానికి ఆకర్షితులై 1930లో జరిగిన సత్యాగ్రహోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు “కులం’ అణిచివేతను అధిగమిస్తూనే భారత స్వాతంత్య్ర పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి నాటి జాతీయ నాయకుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ వాడల నుండి ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో “కులం’ పొరల్ని ఛేదించుకుంటూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. 1935లో బ్రిటిష్‌ ప్రభుత్వం కల్పించిన పాలనాధికార అవకాశాన్ని, అందిపుచ్చుకొని 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి శాసనమండలి సభ్యునిగా, కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా ఇంకా కేబినెట్‌ హోదాల్లో పలు పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నెతెచ్చిన జగ్జీవన్‌ రామ్‌ అఖండ భారతదేశానికి తొలి దళిత ఉపప్రధానిగా నిజాయితీ, అంకితభావ సేవా తత్పరతలే కవచాలుగా చేసుకొని ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే నాటి దేశనాయకులచే “”దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న’’ బిరుదు పొందిన జగ్జీవన్‌ రామ్‌ది క్రమశిక్షణతో (కూడిన) మెలిగిన జీవితం. అర్దశతాబ్దం పైగా క్యాబినెట్‌ హోదాలో పలు పదవులు అలంకరించి మచ్చలేని నాయకుడుగా పేరొందిన ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. బాధ్యతల్ని చిత్తశుద్ధితో, నిబద్ధతగా నిర్వర్తించడమే కాకుండా ప్రశంసార్హంగా మెలగడంలో జగ్జీవన్‌ రామ్‌ నేటి యువతకు ఆదర్శం అయ్యారు. ఇది నేటి యువతకు ఉత్తేజాన్నిస్తుంది. ఘనమైన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల సరసన చేరిన జగ్జీవన్‌ రామ్‌ దార్శనీకత నేటి పాలకులకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆదర్శాలను, నిస్వార్ధ రాజకీయ సేవను అమలు చేయడంలోప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఒక అడుగు ముందుకేయడమే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆలోచనలు, ఆదర్శవంతమైన జీవితం చిరస్మరణీయమైనది. అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో (1946) చేరి “బేబి మినిష్టర్‌’గా పిలవబడ్డ జగ్జీవన్‌ రాం అనతికాలంలోనే తన పరిపాలనా దక్షత, ప్రజలపట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్ధ సేవతో అసమాన ప్రతిభ కనబరిచి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని దేశ నాయకునిగా గుర్తింపుపొందారు. అందుకే ఆయన జీవితం ఓ మహా కావ్యం. “”ఆలోచనల్లో దార్శనీకత, మాటల్లో సూటిదనం, నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్ధులతో సైతం ఔరా అన్పించుకోగల్గిన రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం. చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన బాబూ జగ్జీవన్‌రామ్‌ మౌనం కూడా ఒక్కోసారి ఎదుటివారిని ఆలోచింపచేసింది. అనర్గళ వాక్పటిమతో, అంబేద్కర్‌ సమకాలికుడుగా (16 సంవత్సరాల తేడాతో) దళిత హక్కుల పరిరక్షణలో భుజం కలిపి తనదైన కోణంలో దళితోద్దారకుడుగా పేరొందిన జగ్జీవన్‌రాం ఏనాడూ ఎవ్వరికీ తలవంచని వ్యక్తిత్వంతో చివరికంటా నిలిచాడు. ఇందిరాగాంధీకీ, కాంగ్రెస్‌కు విధేయుడైనప్పటికీ ఏనాడు తలవంచలేదు. తన పదునైన విమర్శలను ఇందిరాగాంధీపై సైతం ఎక్కుపెట్టిన జగ్జీవన్‌రామ్‌ ఆనాడే “ఆత్మగౌరవం’తో తిరుగులేని ధిక్కారాన్ని ప్రదర్శించారు. వ్యంగ్యంతో కూడిన చమత్కారం ఆయన ప్రసంగాలకు రత్నాలద్దినట్టుంటాయన్న నెహ్రూ మాటలు అక్షర సత్యం. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగ్జీవన్‌రామ్‌ సమానత్వం కోసం చివరికంటా పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజలమధ్య, ప్రజల కొరకు సేవ చేసిన ఆయన “1986 జులై 6’న ప్రజలకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు సజీవంగానే ఉన్నాయి. జాతీయవాదిగా, అవిశ్రాంత కృషిసల్పిన దేశ నాయకునిగా మన గుండెల్లో పదిలంగా ఉన్నారన్నది సత్యం. 78 యేళ్ళ ఆయన జీవితంలో 52 ఏళ్ళ రాజకీయ జీవితం ఎంతో విశిష్టమైంది, విలువైంది నేటితరాలు ఆదర్శవంతమైనదని చెప్పవచ్చు.

No comments:

Post a Comment