Friday, January 29, 2016

ఎపిలో స్మార్ట్‌ సిటీలుగా విశాఖ, కాకినాడ

* 20 నగరాలతో తొలి జాబితా
* తిరుపతి పేరు గల్లంతు శ్రీ త్వరలో ఎస్పీవీల ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో అభివృద్ధి చేయనున్న స్మార్ట్‌ సిటీల జాబితాను గురువారం విడుదల చేసింది. రాష్ట్రం నుంచి విశాఖపట్నం, కాకి నాడ నగరాలు జాబితాలో చోటుదక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. స్మార్ట్‌సిటీల కింద అభివృద్ధి చేసేందుకు తిరుపతిని కూడా ఎంపిక చేసినప్పటికీ, తొలి జాబితాలో ఈ నగరం పేరు గల్లంతైంది. స్మార్ట్‌సిటీ పను లను పర్యవేక్షించడానికి కేంద్రం ప్రత్యేకంగా ఎస్పీవీని ఏర్పాటు చేయనుంది. ఒక్కో నగరానికి ఒక్కో ఎస్పీవీ ఉంటుంది. స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనులన్నీ దీని పర్యవేక్షణలోనే కొనసాగనున్నాయి. ఎస్పీవీలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ, ప్రైవేటు రంగాలకు వాటా కల్పించారు. 40:40:20 లేదా 30: 30:40 నిష్పత్తిలో నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అనంతరం కేంద్రం గ్రాంటు రూపంలో ఈ నిధులను రాష్ట్రానికి అందజేస్తుంది. ఎస్పీవీలకు ఛైర్మన్‌గా సంబంధిత జిల్లా కలెక్టర్‌ లేదా స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించనుంది. ఎస్పీవీల ఏర్పాటుపై మున్సిపల్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్‌సిటీల జాబితాలో తిరుపతి, విశాఖపట్నం, కాకినాడలకు చోటు దక్కింది. దీనితో స్మార్ట్‌సిటీల ఏర్పాటు దిశగా తదుపరి చర్యలను తీసుకోవడానికి మున్సిపల్‌ శాఖ సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా తొలుత ఎస్పీవీలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్మార్ట్‌సిటీకి ఒక్కో ఎస్పీవీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఎస్పీవీకి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో ఆర్థికం, ప్రణాళిక, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారి ఒకరిని ఇందులో ఈ స్టీరింగ్‌ కమిటీలో నియమిస్తారు. మార్గదర్శకాలను ఈ కమిటీని నిర్ధరిస్తుంది. మార్గదర్శకాల రూపకల్పనలో నగరస్థాయి కమిటీకీ భాగస్వామ్యాన్ని కల్పిస్తారు. ఈ కమిటీలో సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌, సాంకేతిక నిపుణులను ఇందులో చోటు కల్పిస్తారు.

స్మార్ట్‌సిటీ కార్యకలాపాల పర్యవేక్షణపై సర్వాధికారాలను కేంద్రం ఎస్పీవీలకు కల్పించింది. సాధారణంగా స్థానిక సంస్థలు చేసే రోజువారీ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకునే అధికారం దీనికి ఉంటుంది. సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతితో పన్నుల వసూళ్లు, యూజర్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలను కూడా వసూలు చేసే హక్కు దీనికి ఉంటుందని సమాచారం. ఎస్పీవీలను ఏర్పాటు చేస్తూ పెట్టే పెట్టుబడిలో ప్రైవేటు రంగానికి 20 లేదా 40 శాతం వాటా కల్పించినందున, స్మార్ట్‌సిటీల్లో వసూలయ్యే పన్నులు, యూజర్‌ ఛార్జీలు నేరుగా ప్రైవేటు సంస్థల జేబుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

No comments:

Post a Comment